Monday, November 27, 2017 0 comments By: visalakshi

హరినామ మహిమ - అజామిళుని కధ



హరిని స్మరిస్తూ హరినే మదిలో ధ్యానిస్తూ హరినే శరణుజొచ్చిన జీవుని యమభటులు ఏమీ చేయలేరు. ఆ జీవుని ఏ పాపాలూ అంటవు. ఇందుకు తార్కాణంగా నీకు  అజామిళుని  కధను  చెబుతాను  విను  అని  శుకుడు
 పరీక్షిత్తుకు ఆ చరిత్రను వినిపించాడు...




కన్యాకుబ్జం అనే నగరంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆతడు శాంత స్వభావముతో ధర్మ సుశీలుడై సకలవేదములు చదివినవాడై, ఎల్లప్పుడూ గురువులను, అతిధులను గొప్పవారిగా భావించి సేవా శుశ్రూషలను చేసెడివాడు. సర్వజీవరాసులపట్ల సమబుద్ధియై యుండెడివాడు. సత్యభాషణా నియమము పాలించెడివాడు.అంతటి ఉత్తమ సద్బ్రాహ్మణుడైన అజామిళుడొకనాడొక పొదలో ప్రియునితో గాఢ రతికేళిలో నున్న ఒక కాముకిని చూసెను. ఆ శృంగారమును కనులారా గాంచి కాముకుడై యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నశించగా పాపకర్మలన్నీ చేసేవాడు. నియమనిష్టలు, సదాచారాలు అన్నీ మరచాడు.  కట్టుకున్న భార్యను వదలి.. .....జూదము  స్త్రీలు, శృంగారముపై   ఆసక్తితో ..ధనం కోసం దొంగతనాలు చేసేవాడు. ఒక దాసీని వరించి పెళ్ళి చేసుకొన్నాడు. పది మంది పుత్రులను కన్నాడు. వారిని ముచ్చటగా లాలించి పాలించి పెంచాడు. సంసారవ్యామోహంలో పడి చాలాకాలం భార్యాపిల్లలతో సుఖించాడు. వయస్సు పెరిగే కొలదీ శరీరంలో జవసత్వాలు తగ్గిపోయాయి. 88 ఏళ్ళు వచ్చాయి. అయినా సంసారంపై భ్రాంతి పోలేదు. చిన్నకొడుకైన నారాయణుడిని చాలా గారం చేసేవాడు. వాడంటే అజామిళుడికి ప్రాణం.వాడు కనబడకపోతే ఉండలేడు ఒక్కక్షణం. మృత్యువు పొంచిఉన్నా మోహబంధాల్ని విడువడు. కొడుకునే తలుచుకొంటూ, కొడుకునే పిలుస్తూ గుటకలు మ్రింగుతున్నాడు. అతని ఆయుర్దాయం ముగియడంతో యమకింకరులు అతడిని సమీపించారు. యమపాశాలతో యమకింకరులను చూసిన అజామిళుడు భయంతో వణుకుతూ దూరంగా వున్న చిన్నకొడుకును నారాయణా, నారాయణా అని పిలిచాడు. విష్ణువు పేరు వినబడగానే ఆయన సేవకులు తమ ప్రభువును కష్టకాలంలో కాపాడేందుకు పిలిచిన వారెవరా అని పరిగెత్తుకు వచ్చి యమభటులను అడ్డుకొన్నారు. 




యమదూతలు తమ ప్రయత్నానికి విఘ్నం కలిగించినవారిని తేరిపారజూచి ఎవరు మీరు? చూడ్డానికి చక్కగా ఉన్నారు. మీ రూపాలు, ధరించిన భూషణాలు అద్భుతంగా ఉన్నాయి. మా ధర్మాన్ని పాటిస్తుంటే ఎందుకు అడ్డుపడ్డారు?అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు మీరు యమభటులైతే మాకొక సంగతి చెప్పండి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? మీరు ఎవరిని ఎందుకు దండిస్తారో, ఇతడిని ఎక్కడికి తీసుకొని పోబోతున్నారో చెప్పండి అని అడిగారు. యమభటులు వారికిలా సమాధానం చెప్పారు. 

"వేదసమ్మతమైన కార్యం ధర్మం. వేదవిరుద్ధమైనది అధర్మం. హరిరూపమే వేదం కాబట్టి అది అనుసరణీయం. ప్రాణకోటికి ప్రకృతే ధర్మాధర్మాలను తెలియజేస్తుంది. కర్మచేసేవాడికి శుభమో, అశుభమో కలగకమానదు. బ్రతికి ఉన్నప్పుడు పుణ్యం, పాపం ఎంత చేస్తాడొ అంతగా దాని ఫలాన్ని చనిపోయాక అనుభవిస్తాడు. యముడు అంతర్యామి. జీవులుచేసే మంచిపనులు, చెడుపనులు గమనిస్తాడు. వాటికి తగినవిధంగా ఫలాన్నిస్తాడు. ప్రాచీనకర్మలవల్ల వర్తమానదేహం ఏర్పడుతున్నది. కాని పూర్వజన్మ జ్ఞాపకం లేనందున కార్యకారణ సంబంధం తెలుసుకోలేరు. వర్తమాన వసంతకాలంలో పువ్వులు, పండ్లు చూసినవాడు గత వసంతకాలంలో ఉన్నవి, రానున్న వసంతకాలంలో ఉండేవి ఊహించగలిగినట్లే గతజన్మ, భావిజన్మలలో జరిగినవి, జరగబోయేవి ఈ జన్మలోని కర్మలను బట్టి ఊహించుకోవచ్చు.పూర్వజన్మ సంస్కారబలం వలన గుణస్వభావాలు ఏర్పడి తదనుగుణమైన కర్మలు చేయడం జరుగుతుంది. వాటిని బట్టే స్థూల సూక్ష్మ శరీరాలు కలుగుతాయి. ఇదంతా ప్రకృతిపురుషుల కలయిక ఫలితం. పమేశ్వరుని సేవించితే ప్రకృతి దూరమవుతుంది."  




 ఈ అజామిళుడు పూర్వజన్మ పుణ్యాన బ్రాహ్మణుడై పుట్టాడు. వేదాలు చదివాడు. నిత్యనైమిత్తిక కర్మలు నిష్ఠతో ఆచరించాడు. యౌవనదశలో ఒకనాడు చూసిన దృశ్యంతో ఆతని మనసు పెడత్రోవ పట్టి కోరికలతో భార్యను వదలి ఆ దృశ్య సుందరినే పట్టి ఆమెకోసం అన్నివిధాలా బ్రష్ఠుడయ్యాడు. ఆమెను కుటుంబాన్ని పోషిస్తూ శుచికి స్వస్తి చెప్పి దుష్టుడయ్యాడు. అందువలన పాపాత్ముడైన ఈ ధూర్తుని మేము నరకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాం. అక్కడ ఇతనికి తగిన శిక్ష వేస్తాం. అన్నారు యమదూతలు.

మీరు ధర్మదూతలు. ధర్మం తప్పి మాట్లాడుతున్నారు అన్నారు విష్ణుదూతలు. అజామిళుడు కోటికి మించి జన్మలెత్తి పాపాలన్నిటినీ ప్రక్షాళనం చేసుకొన్నాడు. మరణ సమయంలో నారాయణ అని భగవన్నామ స్మరణ చేశాడు కదా! హరినామ మహిమ మీకు తెలియదా? బ్రహ్మహత్య, దొంగతనం, మధుపానం వంటి మహాపాతకాలకు కూడా హరినామం విరుగుడు. హరినామ స్మరణం ముక్తిదాయకం పుణ్యకారకం. పుత్రుడిని మనసులో పెట్టుకొని పిలిచినా హరి నామ స్మరణ మాత్రముననే చేసిన పాపం నశిస్తుంది.తెలియక తీసుకున్నా ఔషధం వల్ల రోగం నయమయినట్లు పామరుడు తెలియక పలికినా హరినామం దాని మహిమ అది చూపుతుంది. కాబట్టి నారాయణుని స్మరించిన పుణ్యం ఇతనికి ఎలా వృధా అవుతుంది. మీకేమైనా సందేహాలుంటే మీ రాజును అడగండి అని పలికి విష్ణుదూతలు అజామిళుని పాశాలను తొలగించి మృత్యువునుంచి రక్షించారు. యమదూతలు యమలోకానికి తిరిగి వెళ్ళి యమరాజుకు జరిగినదంతా వివరించారు. 




అజామిళునికి భయం పోయి ఆనందం కలిగింది. లేచి నిలబడి విష్ణుదూతలకు నమస్కరించాలని ప్రయత్నిస్తుండగా వారు వెంటనే అదృశ్యమై వైకుంఠానికి  వెళ్ళిపోయారు .అజామిళుడు విష్ణుదూతల మాటలను మననం చేసుకొని హరిభక్తుడయ్యాడు. తన పాపాలను తలచుకొని విచారించాడు. కులాచారాన్ని కూలద్రోసి కాముకిని చేరదీసి బంధువులలో పరువు పోగొట్టుకున్నాను. చక్కని భార్యను తల్లిదండ్రులను నిందించి వారిని విడిచిపెట్టి సర్వం కోల్పోయాను. నరకానికి పోవలసిన నన్ను రక్షించిన మహాపురుషులెవరో ఎక్కడికి పోయారో అని చింతించాడు.("పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు") ఆతని అజ్ఞానం తొలగింది. మదిలో జ్ఞానదీపం వెలిగింది. సంసారమోహం నశించి హరిభక్తి కలిగింది. వైరాగ్యంతో తత్వం తెలిసింది. గంగాతీరానికి వెళ్ళి దైవసన్నిధిలో కూర్చుని యోగాభ్యాసం చేశాడు. సమాధిలో నిలిచి భగవద్ధ్యానంలో లీనమైపోయాడు. తనను మొదట మృత్యువు నుంచి రక్షించిన హరిదూతలను దర్శించి మ్రొక్కాడు. వారు అతనిని దివ్యమైన బంగారువిమానంలో ఎక్కించి వైకుంఠానికి తీసుకొనిపోయారు. కళేబరాన్ని గంగఒడ్డున వదిలి అజామిళుడు ఆ విధంగా ముక్తిపొందాడు.




యముని ఆజ్ఞ విఫలమైందని... యమదూతలు అజామిళుని తీసుకు రాలేకపోయిన వైనం యమధర్మరాజుకు వివరించి, అయ్యా ముల్లోకాల్లోనూ పాపులను శిక్షించే అధికారం నీకొక్కడికే గదా ఉంది. నీ శాసనాన్ని ధిక్కరించగల శక్తి ఎవరికైనా ఉందా? ఇలా ఎందుకు జరిగింది? మీ పాశాలను త్రుంచి మమ్మల్ని పారద్రోలారు. వారెవరో మాకు చెప్పండి అని అడిగారు. యముడు ఈశ్వరుని ధ్యానించి మనస్సులోనే భక్తితో నమస్కరించి దూతలతో ఇలా అన్నాడు.నేను గాక నా కన్న ఘనుడైనవాడు మరొకడున్నాడు. మనం కళ్ళతో చూడడం, కాళ్ళతో నడవడం అంతెందుకు? మనం బ్రతకడమే ఆయన దయవల్ల అనుకోండి. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, నేను కూడా ఆ మహనీయుని మూర్తిని చూడలేము. అటువంటివాడు విష్ణుమూర్తి. ఆయన తత్వాన్ని తెలుసుకోవడం బ్రహ్మతరం కాదు. హరినామ మహిమ వల్లనే అజామిళుడు యమపాశాలను తప్పించుకోగలిగాడు. అందువలన మీరు భక్తితో శ్రీహరి పాదాలను ఆశ్రయించిన వారి వద్దకు వెళ్ళకండి. అని యముడు  హరినామ మహిమను తన భటులకు   వివరించాడు .

ఆనాడే భాగవతంలో అజామిళుని కధద్వారా మనకు హరినామ స్మరణ మాత్రము చేత మరియు ఆతని గత జన్మ కర్మల పుణ్య వశాన ఆతనికి ముక్తి లభించింది అని తెలుస్తొంది.  

స్మరణం అనేది నవవిధ భక్తులలో ఒకటి. కలియుగములో స్మరణ మాత్రము చేతనే ముక్తి లభించునని సద్గురువులు మనకు చెబుతారు. మనమంతా ఆ మహా విష్ణువు సంతానమే! ఎప్పుడూ అందరికీ మేలు చేయవలయును కానీ అందరినీ సంతోషపరచవలెనని ప్రయత్నమును చేయరాదు. అది అసంభవము.ఎవరైతే ఆ శ్రీహరి లీలలు అనుభవించి వాటిని మననం చేసుకుంటూ అద్వితీయ పారవశ్యంలో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. దివ్యమైన అవతార తత్త్వాన్ని, లీలల్ని పరిశీలించి అర్ధం చేసుకోగలరో వారు దేహాన్ని వదలిన తదుపరి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు. వారికి శ్రీహరి శాశ్వతమైన ధామములో స్థానం లభిస్తుంది.  సర్వవ్యాపి అయిన హరిని మనస్సుతో, నోటితో స్మరిస్తూ అంతటా తానే అయి ఉన్నాడని గుర్తించే శక్తిని మనకిమ్మని ఆయనను మనసారా భజిస్తూ ...ఓం శ్రీ నమో నారాయణాయ నమో నమ:   




 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు