Saturday, July 1, 2017 By: visalakshi

ఆండాళ్ తల్లి - గోదాదేవి



తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరియాళ్వారు) తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. (గోదా-భూమి, గోదాదేవి- భూమి నుండి ఉద్భవించినది)

ఆ పసిపిల్ల దిన దిన ప్రవర్ధమానమగుచు అందరిని సంతోషపెట్టుచుండెడిది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణనుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ,  యుక్త వయస్సువచ్చు సరికి శ్రీమన్నారాయణుని తప్ప మనుజుల నెవ్వరిని వరించబోనని తన నిశ్చయము తెలిపినది.

తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యము చేయుచుండట చూసి గోదాదేవి పరవశించెడిది. తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యము చూచుకొనుచు తిరిగి ఆ మాలలను యధాస్థానమున నుంచెడిది. ఒక నాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్రశాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగ మందలించాడు. అమ్మా! స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా! అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు సమర్పించకుండుటకు విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ యెనరించిన చిన్ని అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు.



వటపత్రశాయి చిరునగవుతో విష్ణుచిత్తుని చూసి నీవు చింతించవలదు. సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చని మాలికలు మాకు వద్దు. ఆమె విషయము మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని చెప్పాడు.

గోదాదేవి యుక్త వయస్సు నొందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్రశాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనస్సులో ఊహించుకొని భోగిపండుగకు ముప్పై రోజుల ముందునుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో రోజుకొక పాశురం(శ్లోకం) చొప్పున 30 పాశురాలు రచించారు గోదాదేవి.  ధనుర్మాసములో తోడి బాలికలతో స్నానము చేసి వటపత్రశాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగను, తోడి చెలులు గోపికలుగను, వటపత్రశాయి శ్రీకృష్ణునిగను, తాను ఒక గోపాంగనగ భావించి వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యములతో దినమున కొక్క పాశురమును ద్రావిడ భాషలో (తమిళములో)వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచూ చెలులతో కాత్యాయనీ వ్రతము చేసింది.

1 వ పాశురమును "మార్గళిత్తంగళ్..........."అని మొదలు పెట్టిన శ్లోక భావార్ధం...
అనేక సంపదలతో తులతూగుతున్న వ్రేపల్లెలో భగవంతుని సేవలు చేయడమే మా సంపద అని భావిస్తూ అటువంటి సేవయే ఆభరణములుగా ధరించిన ఓ బాలికలారా! మనం ధనుర్మాస వ్రతం ప్రారంభించడానికి తిధి, వార వర్జ్యాలు చూసుకొని మనమీ వ్రతాన్ని ప్రారంభించడం లేదు. మార్గశిరమాసం నిండు పున్నమి రోజులు. సంకల్ప క్షణమే  వ్రతం మొదలు పెట్టాలి అని దివ్యమైన సందేశాన్ని ఆండాళ్ తల్లి మనకు ఈ మొదటి పాశురంలో అందిస్తోంది. భగవంతుని నామస్మరణ చేతనే సకల విధ  శుభ ఫలములు వాటంతట అవే కలుగుతాయని గోదాదేవి యొక్క ప్రధాన మనోగతం. అందుకే ప్రతి పాశురం చివరలో 'మేము చేయు వ్రతమునకు రండి జనులారా!' అని ఆండాళ్ తల్లి అందరిని నామస్మరణతో తరించమని చెప్తున్నారు. "మాసానాం - మార్గాశీర్షోహం" అని సాక్షాత్తూ గీతాచార్యుడు తానే సాక్షాత్తుగా మార్గశిరమాసమును. అని చెప్పాడు. ఎంతటి పుణ్యమాసమో కదా! మా..అంటే అమ్మ. శుభప్రధ మైన లక్ష్మీ కటాక్షం అపారంగా ప్రవహించే మాసమిది. మార్గళి అను పదంలోనే లక్ష్మీ నారాయణులిద్దరినీ స్మరిస్తూ తిరుప్పావైని ప్రారంభించింది ఆండాళ్ తల్లి.

 ఒక రోజున తన తండ్రిని 108 దివ్యతిరుపతలలోని మూర్తుల కళ్యాణగుణములను చెప్పవలసిందిగా కోరింది. పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.

ఆ వర్ణనలను వింటూంటే శ్రీరంగమున వేంచేసి యున్న శ్రీరంగనాయకుని మహాదైశ్వర్యవిభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడ దలచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహ మెట్లు జరుగుతుందని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్రశాయి నీకుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్ము అని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అరోజు రాత్రి విష్ణుచిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడెదను. సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళములతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగమునకు తీసుకొని వెళ్లిరి.



ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహము చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయములోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది.

శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని చూసి నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి ఇతర సత్కారములొనర్చి పంపాడు.

గోదాదేవికి ఆండాళ్‌ ( భక్తుల మేలుకొనునది), చూడి కొడుత్తామ్మాల్‌ (స్వామికి తాను ముడుచుకుని పూమాలలు ఇచ్చునది) అని పేర్లు వచ్చాయి.

గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగత్‌ విఖ్యాతినంది అన్ని వైష్ణవదేవాలయాలలోను ధనుర్మాసమందు ప్రతియేటా అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పది రోజులు పాశురములను పాడుచు లోకోత్తరముగ సేవలు చేయుచున్నారు. ఆమె తిరుప్పవై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతింపబడుచున్నవి. తిరుప్పావై దివ్య ప్రభందమే. 30 రోజులు పాడినవి మేలుపలుకుల మేలుకొలుపులు.

 ఆండాళ్‌ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్‌ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్‌ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది.



గోదాదేవి పూర్వజన్మ వృత్తాంతము :

చూడి కొడుత్త నాచ్చియార్‌ జన్మ గురించి ఒక భగవత్‌గాథ ప్రాచుర్యంలో ఉంది. పురుషోత్తమక్షేత్రంగా ప్రసిద్ధిచెందిన పూరీలో వసంతాచార్యులనే భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడిగా సేవలందించేవాడు. ఎక్కడాలేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు వెలితిగా ఉండేది. శ్రీకృష్ణావతారంలోని సుభద్ర ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనను వేధిస్తూండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. శ్రీకృష్ణావతారం సందర్భంగా ఆ అవతారపురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రనూ సమ్మోహపరచిందనీ, అందుకే స్వయంభూ అయిన పూరీ క్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్రంలో చోటుకల్పించాడని తండ్రి వివరించాడు.

ఈ వివరణతో సంతృప్తిపడని వసంతాచార్యులు శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్లి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాదులను విడిచి వ్రతం ప్రారంభించాడు. ఆలయంలో ప్రధాన అర్చకుడు లేని కారణంగా జగన్నాథుని పూజాదికాలు సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథుడు- వసంతాచార్యుని అనుమానం తీర్చేందుకు వసంతుని ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడనీ, అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్య భావం కలిగి ఉంటానని వివరించాడు. కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తనకు కనిపించాలని వసంతుడు పట్టుబట్టడంతో దైవం ఆ భక్తునికి వరం ప్రసాదిస్తూ 'వసంతా! నీవు వీక్షించడానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురిగా లభిస్తుంది. నీవు నిర్వహించిన అర్చన సేవల కారణంగా మరుజన్మలో నీవు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునిగా జన్మించి శ్రీరంగనాథుని భక్తునిగా ప్రఖ్యాతి చెందుతావు. నీ భక్తినే నాపై అనురక్తిగా చేసుకొని నీ కూతురిగా పెరిగిన శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది' అని తెలిపాడు. అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించడంకోసం చూడికొడుత్త నాచ్చియార్‌ అవతరించిందని చెబుతారు. ఆండాళ్‌ (చూడికొడుత్త నాచ్చియార్‌) పసివయస్సులోనే పరిమళించిన వికసిత భక్తి కుసుమం.

 తెలుగు పండగలు- దేవుళ్ళు అనే బ్లాగు సౌజన్యంతో నా ఈ టపా....

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు


0 comments: